నగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) తన నిఘాను తీవ్రం చేసింది. వేసవి తీవ్రతతో పాటు పలు బస్తీల్లో నీటి ఎద్దడి ఏర్పడుతున్న తరుణంలో, తాగునీటిని బేఖాతరుగా వృథా చేస్తున్న వారిపై జలమండలి కొరడా ఝుళిపించింది. నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఒక ప్రముఖ వాణిజ్య (Commercial) సంస్థకు తాగునీటిని నిర్లక్ష్యంగా వృథా చేసినందుకు అధికారులు బుధవారం ₹10,000 భారీ జరిమానా విధించారు.
నిర్లక్ష్యానికి భారీ మూల్యం: జలమండలి అధికారుల కథనం ప్రకారం.. సదరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కు చెందిన అండర్గ్రౌండ్ వాటర్ సంప్ నిండిపోయినప్పటికీ, మోటార్ను అలాగే వదిలేశారు. దీనివల్ల వందలాది లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు రోడ్డుపైకి చేరి దాదాపు అర కిలోమీటర్ మేర వృథాగా ప్రవహించింది. ఈ విషయాన్ని గమనించిన లోకల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M) డివిజన్ అధికారులు తక్షణమే స్పందించారు. గతంలోనే ఇదే సంస్థకు నీటి వృథాపై హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, మళ్లీ అదే నిర్లక్ష్యాన్ని పునరావృతం చేయడంతో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (MD) ఆదేశాల మేరకు ₹10,000 జరిమానా చలాన్ జారీ చేశారు. అంతేకాకుండా, మరోసారి ఇలాగే నీటిని వృథా చేస్తే కనెక్షన్ను శాశ్వతంగా తొలగిస్తామని తుది నోటీసు ఇచ్చారు.
ఎండల వేళ జలమండలి కఠిన నిర్ణయాలు: నగరంలో ఒకవైపు నీటి నిల్వలు తగ్గుతుండటం, మరోవైపు కొన్ని నివాస ప్రాంతాల్లో నీటి కొరతపై ప్రజలు ఆందోళనలు చేస్తున్న తరుణంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాగునీటిని కేవలం తాగడానికి, వంట వండుకోవడానికే పరిమితం చేయాలని.. రోడ్లు కడగడానికి, కార్లు కడగడానికి మరియు కమర్షియల్ ప్రయోజనాలకు విచ్చలవిడిగా వాడితే ఊపేక్షించేది లేదని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా ప్రతి ఉదయం స్పెషల్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తాయని, ప్రజలు కూడా ఎక్కడైనా నీటి వృథా కనిపిస్తే సోషల్ మీడియా లేదా వాటర్ బోర్డు వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.